తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్ర మూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
మూడవరోజు ఫిబ్రవరి 28న శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీమలయప్ప స్వామివారు నాలుగో రోజు మార్చి 01న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 02వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఇదిలా ఉండగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.



















