అమరావతి : పేదల ఆకలిని అన్న క్యాంటీన్లు తీరుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గం నాలుగు రోజుల పర్యటనల్లో భాగంగా గురువారం శాంతిపురంలో అన్న క్యాంటీన్ ను సందర్శించారు. నాన్న దివంగత ఎన్టీఆర్ పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఉండాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఆనాడు కిలో రూ.2కే బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారని అన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కోసం అన్న క్యాంటీన్లు పెట్టి ఆకలి తీరుస్తున్నారని చెప్పారు. . ఈ పవిత్రమైన యజ్ఞంలో నేను కూడా ఈరోజు భాగస్వామిని కావడం చాలా ఆనందంగా ఉందన్నారు నారా భువనేశ్వరి.
అంతకు ముందు రామకుప్పంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నారా భువనేశ్వరి ఆవిష్కరించారు.
కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావడంతో కిలోమీటరు మేర భువనేశ్వరి వారితో కలిసి నడిచారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించిన ఘనత ఎన్టీఆర్ దేనని చెప్పారు.

















