తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్ప యాగానికి శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం వల్ల సమస్త దోషాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం.23వ తేదీన గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారు, అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండ రామస్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి 7.00 గంటలకు శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమించారు. ఈ పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇస్పెక్టర్లు సురేష్ బాబు, హరికృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) భారీ ఎత్తున టీటీడీ ఆద్వర్యంలోని ఆలయాలను అభివృదద్ది చేసే పనిలో పడింది. అంతే కాకుండా ప్రతి ఆలయంలో తిరుమలలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమం జరగాలని ఆదేశించారు. ఇప్పటికే ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయంలో ప్రారంభించారు.
