Amarnath Yatra : ఆధ్యాత్మికతకు ప్రతీకగా, ప్రకృతి అందాలకు నిలయంగా భావించే హిమాలయాల్లో అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఏడాది పాటు మంచుతో కప్పబడే పవిత్ర గుహలో ప్రతీవర్షాకాలంలో సహజంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.
Amarnath Yatra 2025 Updates
ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే 38 రోజుల అమర్నాథ్ యాత్రను జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పటాకా ఊపి అధికారికంగా ప్రారంభించారు. మొదటి రోజు 5,892 మంది యాత్రికులు భగవతి నగర్ బేస్ క్యాంప్ (జమ్మూ) నుంచి బయలుదేరారు.
యాత్ర మార్గాలు – భద్రతా చర్యలు
ఈ యాత్రకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి:
పహల్గామ్ మార్గం – దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి.
బాల్టాల్ మార్గం – మధ్య కాశ్మీర్ గాందర్పాల్ జిల్లాలోని సోనామార్గ్ వద్దనున్న బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి.
ఈ రెండు మార్గాల నుంచీ భక్తులు, మహిళలు, సన్యాసులు, పెద్ద సంఖ్యలో యాత్రికులు తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో ప్రయాణం ప్రారంభించారు. భద్రతా పరంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని చెప్పారు.
హిమాలయ గర్భంలో శివతత్వ దర్శనం
హిమాలయాల మధ్య 17,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. హిందూ ధర్మంలో పవిత్రతకు నిలయంగా భావించే ఈ యాత్రకు బౌద్ధులు, జైనులు కూడా గౌరవంతో చూస్తారు. నమ్మకాన్ని, భక్తిని నడకలతో నెరపే ఈ యాత్ర భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తోంది.
ఈ ఏడాది ఎలాంటి అంతరాయాలు లేకుండా, సమర్థంగా యాత్ర సాగిపోవాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read : Bhadrakali Temple Interesting Facts : వరంగల్ భద్రకాళి అమ్మవారి విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు



















