హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. నాలాలు, వరద కాలువల్లో పేరుకు పోయిన పూడికను పూర్తి స్థాయిలో తొలగిస్తే.. వర్షాకాలం నివాసాలను వరదలు ముంచెత్తవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. నాలాల్లో పూడిక తీయడానికి ఎక్కడైనా ఇంటి వాకిలి అడ్డుగా ఉండి.. తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే వెంటనే ఆ పని పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అప్పుడే ప్రవాహానికి ఆటంకం తొలగుతుందన్నారు. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న డీ సిల్టింగ్ పనులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రహ్మత్నగర్, కృష్ణానగర్, అమీర్పేట, గాయత్రినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. నాలాలు, వరద కాలువల్లో డీసిల్టింగ్ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి..? అందుకు గల కారణాలను, పరిష్కార మార్గాలను స్థానికులతో చర్చించారు ఏవీ రంగనాథ్. అంతే కాకుండా నాలాలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు అధికారులకు. వేసవి కాలం అనేది పనులు చేపట్టేందుకు వీలు కలుగుగుతుందని అన్నారు కమిషనర్. ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నారు. వర్షాలు మొదలైన తర్వాత పెద్ద పనులు చేయలేం అని చెప్పారు. ఈ వర్షాకాలానికి ఎక్కడా వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు ఏవీ రంగనాథ్.
















