Airtel : భారత టెలికాం రంగంలో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థలు వరుసగా తమ ప్రీపెయిడ్ ప్లాన్లను సమీక్షిస్తూ, కొన్ని పాత ప్యాక్లను నిలిపివేస్తున్నాయి. ఇటీవల జియో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, ఎయిర్టెల్ (Airtel) తన ప్రముఖ రూ.249 ప్రీపెయిడ్ ప్యాక్ను తొలగించింది. ఈ పరిణామం లక్షలాది వినియోగదారులపై ప్రభావం చూపనుంది.
Airtel – రూ. 249 ప్యాక్ ప్రత్యేకత ఏమిటి?
ఈ ప్లాన్ తక్కువ ధరలో సమర్థవంతమైన సేవలు అందించడంతో వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందింది. ఈ ప్యాక్లో రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలతో పాటు, స్పామ్ కాల్ అలర్ట్, ఎయిర్టెల్ (Airtel) ఎక్స్స్ట్రీమ్ యాక్సెస్, హెలోట్యూన్స్ వంటి అదనపు సేవలు ఉచితంగా లభించేవి. దీని వాలిడిటీ 24 రోజులు.
కొత్త ప్లాన్ రూ. 299 నుండి
తాజాగా ఎయిర్టెల్ తన వెబ్సైట్ మరియు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ నుండి రూ. 249 ప్యాక్ను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ ధర డేటా ప్లాన్ రూ. 299 నుండి ప్రారంభమవుతోంది. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. దీని వాలిడిటీ 28 రోజులు. అంటే రూ. 50 అదనంగా చెల్లించాల్సి వచ్చినా, వినియోగదారులకు నాలుగు రోజుల ఎక్కువ సేవల లభ్యత ఉంటుంది.
జియో కూడా అదే దారిలో
సామాన్య వినియోగదారులకు ఇది మరో ఊహించని పరిణామం. ఎందుకంటే జియో కూడా ఇటీవల రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ఇప్పటికీ జియోలో ప్రారంభ డేటా ప్లాన్ రూ. 299 నుంచే అందుబాటులో ఉంది. ఇది కూడా అదే విధంగా 1GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల చెల్లుబాటుతో అందుతుంది.
వోడాఫోన్ ఐడియా (Vi) మిగిలిన ఏకైక ఆప్షన్
ప్రస్తుతం రూ. 249 ప్లాన్ను కొనసాగిస్తున్న ఏకైక టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే. Vi ప్యాక్ ద్వారా రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు 28 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. తక్కువ బడ్జెట్ వినియోగదారుల దృష్టిలో Vi మాత్రమే ఒక ప్రత్యామ్నాయంగా మిగిలింది.
Also Read : Indian Railways Growth : ఇకపై 1 నిమిషంలో ట్రైన్ రిజర్వేషన్



















