తిరుపతి : సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్ట సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు , 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 04వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులను జారీ చేసి, స్వీకరించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టిటిడి వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి.
ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది. 1960లో స్థాపించబడిన ఈ శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏకైకంగా నిలిచి, భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది.
డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 సంవత్సరాలు) ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి. ఇందులో ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం ఉంది. ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.
సంప్రదాయ కలంకారి కళ (2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు) వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టిటిడి ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు.
