హైదరాబాద్ : మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సమాజంలోనే ఉన్నానని, దానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టనని స్పష్టం చేశారు. తనకు 30 ఎకరాల పొలం ఉందని, సినిమా ఇండస్ట్రీ వద్దని అనుకుంటే అక్కడికి పొలం పనులు చేసుకుంటూ బతుకుతానని చెప్పారు. తాను కావాలని ఎవరిని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు శివాజీ. కానీ కావాలని గత కొన్ని రోజుల నుంచి తనను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగతంగా తనను కించ పర్చడం, ఆపై వార్నింగ్ లు ఇచ్చేంత దాకా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వాళ్ల గురించి తాను ఇక నుంచి ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పారు. వ్యవస్థలంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. అయితే తనతో మంచిగా ఉంటూనే , తన వెనుక గోతులు తవ్వారని వాపోయారు శివాజీ. ఇదే తనను బాధకు గురయ్యేలా చేసిందన్నాడు. తనపై ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరిగిందని, తనతో కెరీర్ మొదలు పెట్టిన వారే అసూయతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదని మరోసారి నొక్కి చెప్పారు నటుడు. మొత్తంగా ఇప్పుడు బుద్ది వచ్చిందన్నారు. ఎవరైనా తమకు ఇబ్బంది కలిగిందని భావిస్తే తాను సారీ చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు.


















