TTD : తిరుపతి : టిటిడిలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని టిటిడి నుండి బదిలీపై వెళ్తున్న ఈవో జె. శ్యామల రావు తెలిపారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా టిటిడి (TTD) పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా జె. శ్యామల రావు మాట్లాడారు. తన కాలంలో చాలా దూరదృష్టితో విధాన పరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. టిటిడి అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు.
TTD EO key Comments
భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి, లోపాలను సవరించుకుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నం చేశానని చెప్పారు. ఉద్యోగుల సహకారం మరువలేనిదని అన్నారు. వచ్చే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చామని చెప్పారు ఈవో. ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ లకు టిటిడి ఈవోగా పని చేయాలని ఉంటుందన్నారు. తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని, అనుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు, సీఎంకు , తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Minister Lokesh Shocking Comments : కల్వకుంట్ల కవిత చేరికపై లోకేష్ కామెంట్స్

















