హైదరాబాద్ : బీసీలకు 42 శాతం చట్ట బద్దంగా కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ గల్లీలో ఉద్యమించినట్టుగానే ఇక రేపటి 15వ తేదీ నుండి ఢిల్లీలో ఉద్యమిస్తామని ప్రకటించారు. బీసీల చలో ఢిల్లీ ద్వారా ఢిల్లీ దిగి వచ్చేలా బీసీల పోరాటం ఉంటుందని హెచ్చరించారు. బీసీ జేఏసి ఈనెల 15,16 తేదీలలో ఇచ్చిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆదివారం తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం వందలాది మంది ఉద్యమకారులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు . ఢిల్లీకి వెళ్తున్న ఉద్యమకారులకు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జెండా ఊపి ప్రారంభించారు
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 పెంచుతూ చేసిన చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోని ఆమోదించాలని అన్నారు. దేశ వ్యాప్తంగా బీసీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్ లతో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్ . ఛలో ఢిల్లీ ద్వారా నైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు
తమ రెండు మూడు రోజుల ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులను కలిసి బీసీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు ఢిల్లీ బయలుదేరిన వారిలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బి మణి మంజరి, కాటేపల్లి వీరస్వామి, కౌల జగన్నాథం, నందగోపాల్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసచారి, బండి గారి రాజు, తదితరులు ఉన్నారు .


















