Nara Lokesh : ఉండవల్లి – ఆంధ్రా ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ కోసం చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
IT Minister Nara Lokesh Promotion
ఈ సందర్భంగా మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే విధంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా సదస్సును విజయవంతం చేయాలని అన్నారు. తద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక రంగ వృద్ధి జరుగుతుందన్నారు. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి.. పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.
సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఖరారు చేశారు. ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్: నేవిగేటింగ్ ది న్యూ జియో- ఎకనమిక్ ఆర్డర్’ ధీమ్ తో ఈ సదస్సును సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు సీఎస్ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : Minister Atchannaidu Promote : ప్రతి ఒక్కరు చేనేత దుస్తులు ధరించాలి

















