అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ప్రచారాలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజలకు ప్రభుత్వ, పాలనా సేవల అంశంపై లీడర్షి్ప్ కాన్ క్లేవ్ లో ప్రసంగించారు. పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని అన్నారు. అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్ను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఏడాదికి రూ.1000 కోట్ల ఆదాయం వస్తున్నా వదులుకుని ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నాం అన్నారు. ఎక్కడైనా ఉచిత ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్తే అడ్డుకోవాలని అన్నారు. ఏ రీచ్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసి పోతోందని చెప్పారు. గత పాలనలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి నకిలీ, జే బ్రాండ్లు విక్రయించారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.
దీంతో 30 వేలమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ నియంత్రించి విక్రయాలను పారదర్శకంగా చేస్తున్నాం అన్నారు. మద్యం టెండర్లు ముగిశాయయని, అయినా ప్రస్తుతం ఎన్ని దుకాణాలు ఉన్నాయో వాటిని రెన్యువల్ చేస్తాం అని ప్రకటించారు సీఎం. అయితే ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి అదనంగా విక్రయించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు . ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటాం. నియోజకవర్గాల్లో దీనిని సెట్ రైట్ చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రల్ని సమర్ధంగా ఫ్యాక్ట్తో తిప్పికొట్టాలన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసులను ఆన్లైన్లోనే అందిస్తున్నాం అని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రతా ఫీచర్లతో ఇస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యల్ని సుమోటోగా తీసుకుని పరిష్కరించాలని పేర్కొన్నారు. తద్వారా మీకూ బ్రాండ్ వస్తుంది. సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పారు సీఎం.

















