హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్ గా స్పందించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయక పోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత క్యాబినెట్లో, ప్రభుత్వంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని స్పష్టం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
పెన్షన్లు రూ.4,000కి పెంచాలని, ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు మండలి చైర్మన్. తక్షణమే సర్కార్ తీసుకు వచ్చిన 22Aను రద్దు చేయాలని కోరారు. అంతే కాకుండా ప్రజలకు ఉచితాలు తగ్గించాలని పేర్కొన్నారు .
ఉద్యమకారులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు.క్యాడర్లో అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాలన్నారు. ఇవన్నీ చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తామని లేక పోతే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
















