అమరావతి : ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్ కు జాతీయ స్థాయిలో కీలకమైన పదవి దక్కింది. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్గా ఏపీ కేడర్కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ వి. నియమితులయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ‘సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్’ కింద ఆయన నియామకం ఐదేళ్ల కాలానికి జరిగింది. ప్రసన్న వెంకటేష్ గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే ఎన్టీఏకు ఆయన ఇప్పుడు నాయకత్వం వహించనున్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారికి జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయనకు సంబంధించి వివరాల లోకి వెళితే తను 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. 4 జూలై 1988లో పుట్టారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. స్వస్థలం తమిళనాడు రాష్ట్రం. ప్రసన్న వెంకటేశ్ గతంలో పలు కీలక పదవులు నిర్వహించారు. పాడేరు సబ్ కలెక్టర్ గా, ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా, ఓడరేవుల శాఖ డైరెక్టర్ గా , విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా, ఏలూరు జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ గా , ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా పని చేశారు. ప్రసన్న వెంకటేష్ పరిపాలనా రంగంలో పట్టణ పాలన, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోర్టులు, గిరిజన అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి విభాగాల్లో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
















