బెంగళూరు : గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం టాక్సిక్ మూవీ. ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల కంటే ముందే కొందరు పనిగట్టుకుని టాక్సిక్ మూవీ బాగో లేదని, డిజాస్టర్ గా నిలిచిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా రీల్స్, మీమ్స్ , రివ్యూస్, వీడియోలు పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చిత్ర బృందం. ఇప్పటికే టాక్సిక్ రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ. 120 కోట్లు వసూలు కాగా 2వ రోజు రూ. 80 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇదే క్రమంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ , కేవీఎన్ ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించారు. యష్ సినిమాపై ‘అపవాదు కలిగించే’ సమీక్షలను నిలిపి వేయాలని కోరారు.
సినిమాలోని ఒక దృశ్యం. ఈ చిత్రం యొక్క ‘బెనిఫిట్ షోల’ సమయంలోనే అనేక ప్రతికూల సమీక్షలు వచ్చాయి. దీనిపై నెటిజన్లు అనేక మీమ్స్ సృష్టించడమే కాకుండా, ఈ సినిమాను ‘డిజాస్టర్’ (అట్టర్ ఫ్లాప్) అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో, సినిమాపై వస్తున్న అవాస్తవ, దురుద్దేశ పూర్వక లేదా పరువుకు భంగం కలిగించే కంటెంట్ను నిలిపి వేయాలని కోరుతూ కేవీఎన్ ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 28న జరగబోయే తదుపరి విచారణ వరకు, వివిధ వేదికలపై ఈ సినిమాకు వ్యతిరేకంగా అటువంటి కంటెంట్ను ప్రచురించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు కోర్టు ‘ఎక్స్-పార్టే’ (ఏకపక్ష) తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ప్రధానంగా యూట్యూబ్ సమీక్షకులు, ఇతరులను ఉద్దేశించినవి కావడం గమనార్హం. వారికి ఇప్పటికే చట్టపరమైన నోటీసులు పంపబడ్డాయి. అయితే నిజాయితీతో కూడిన సమీక్షలు లేదా విమర్శలకు ఈ నిషేధం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కూడా కొన్ని నిర్మాణ సంస్థలు తమ భారీ చిత్రాల విడుదల తర్వాత యూట్యూబర్లకు నోటీసులు జారీ చేశాయి. ఈ చిత్ర బృందం నుండి చట్టపరమైన నోటీసులు అందుకున్న వ్యక్తులు, ఆ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.


















