బెంగళూరు : కర్ణాటక పర్యటనలో బిజీగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గురువారం బెంగళూరుంలో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజీ జార్జ్ తో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఇంధన రంగంలో ఇరు రాష్ట్రాల మధ్య సహకారంపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఎల్ నినో ప్రభావం కారణంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు రోజుకు నాలుగు కోల్ రేక్ల నిరంతరాయ సరఫరాను నిర్ధారించాలని సింగరేణి అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అదనంగా, ఒడిశాలోని నైని బొగ్గు గని నుండి కర్ణాటకకు ఏటా 10 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి సిద్ధంగా ఉందని స్పష్టం చేశామన్నారు.
ఛత్తీస్గఢ్ , ఒడిశాలోని కర్ణాటక బొగ్గు బ్లాక్ల తవ్వకంలో సింగరేణికి ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించు కోవడానికి కేపీసీఎల్-సింగరేణి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయాలని తాను ప్రతిపాదించగా మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు మల్లు భట్టి విక్రమార్క.ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ, విద్యుత్ రంగంలో పురోగతి కోసం కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఇంధన రంగంలో తెలంగాణ , కర్ణాటకల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించామని పేర్కొన్నారు . ఒడిశాలోని నైని బొగ్గు గని నుండి కర్ణాటకకు ఏటా 10 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి కూడా సింగరేణి సిద్ధంగా ఉందన్నారు.















