న్యూఢిల్లీ : ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డయాలసిస్ పేషెంట్లను కూడా వికలాంగుల జాబితాలోకి చేర్చాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల కోసం ఆర్.పి.డబ్ల్యు.డి ( రైట్స్ ఆఫ్ సన్స్ విత్ డిసెబుల్డ్ యాక్ట్ ) చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. తలసీమియా, సికెల్ సెల్ జబ్బులు ఉన్నవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుందన్నారు ఎంపీ. కానీ డయాలసిస్ పేషెంట్లను దీని కిందకు తీసుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పేషెంట్లు నెలకు 12,13 సార్లు డయాలసిస్ చేసుకుంటారని తెలిపారు. ఉచిత చికిత్స అందిస్తున్నా ట్రాస్పోర్ట్ మిగతా వాటికి నెలకు 15 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఇవాళ పార్లమెంట్ లో ఈ డయాలసిస్ పేషెంట్లను RPWD యాక్ట్ కింద చేర్చాలని 377 రూల్ కింద కోరడం జరిగిందని చెప్పారు ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా కిడ్నీ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని వాపోయారు.
మరో వైపు పట్టణీకరణ లో భాగంగా వాగులు వంకలు కుంటలు చెరువులు మాయమవుతున్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో చెరువుకు మురికి కూపాలుగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ మాటలు తప్ప చేతల్లో జీరో అంటూ ఎద్దేవా చేశారు. డ్రైనేజీతో పాటు కెమికల్ వేస్ట్ కూడా ఇందులోనే కలుపుతున్నారని ఆరోపించారు ఎంపీ. గుర్రపు డెక్క పెరిగి, దోమలకు నిలయాలుగా మారాయని పేర్కొన్నారు. పక్కన ఉన్న బోర్లు కూడా కలుషితం అవుతున్నాయని తెలిపారు. డ్రైనేజ్ నీళ్ళు, కెమికల్ నీళ్ళు చెరువుల్లోకి వెళ్లకుండా దారి మళ్లించాలని కోరామన్నారు ఈటల రాజేందర్. వర్షపు నీటితో నింపి మంచి నీళ్ల చెరువులాగా తయారు చేయాలని కూడా 377 కింద కోరడం జరిగిందన్నారు.
















