అమరావతి : ఏపీలో నూతనంగా , అత్యాధునిక వసతి సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ ఎయిర్ పోర్టును ఆధునిక, నిరాటంకమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని రూపొందించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో రూ.5,640 కోట్లకు పైగా దీని నిర్మాణం కోసం ఖర్చు చేశారు. దీనిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం 60 లక్షల మంది ప్రయాణీకులు ఇక్కడి నుండి ప్రయాణించేలా నిర్మించారు.
కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి , భవిష్యత్ విమానయాన అవసరాలను తీర్చడానికి ఈ విమానాశ్రయంలో అధునాతన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతలు, సుస్థిర లక్షణాలను పొందుపరిచారు. అంతే కాకుండా ఈ విమానాశ్రయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఎయిర్సైడ్ 4.0 టెక్నాలజీలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ , బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ , ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల సౌకర్యం , భద్రతను మెరుగు పరచడం, వనరుల వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడం వంటివి చేస్తాయని భావిస్తున్నారు.
















