హైదరాబాద్ : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీపై విత్తనాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల కేంద్రీకృత వంటశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు . వారు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.
ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను స్వీకరించారు ముఖ్యమంత్రి. తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్ నీటిపారుదలపై 75-90 శాతం రాయితీ, పశుగ్రాస విత్తనాల పంపిణీ, రైతులకు శాస్త్రీయ సలహాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తరణ, రైతు బజార్లకు రవాణా సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో పాడి యూనిట్ల ఏర్పాటు, గ్రామ స్థాయిలో అత్యవసర కార్యాచరణ బృందాల ఏర్పాటు వంటి కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
















