బెంగళూరు : తమిళనాడులో నటీ నటులు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఇతర రాష్ట్రాలలో కూడా కొందరు పాలిటిక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిగ్ బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ జాహ్నవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన సామాజిక సేవా కార్యక్రమాల వీడియోలు జెడిఎస్ పార్టీ నాయకుల దృష్టిని ఆకర్షించాయని జాహ్నవి ఈ సందర్ంగా వెల్లడించారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 15లో పార్టిసిపేట్ చేశారు. పెద్ద ఎత్తున జనాదరణ పొందారు. ఈ మాజీ కంటెస్టెంట్ జాహ్నవి జనతా దళ్ (సెక్యులర్)లో చేరడం ద్వారా అధికారికంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రముఖ యాంకర్ , నటి అయిన ఆమె ఇటీవల తన రాజకీయ ఆశయాల గురించి, వినోద రంగం నుండి ప్రజా సేవ వైపు మారడం గురించి మాట్లాడారు. తన రియాలిటీ షో ప్రయాణం గురించి ప్రస్తావించారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ , విమర్శలు గణనీయంగా తగ్గాయని జాహ్నవి పేర్కొన్నారు.
షోలో ఉన్నప్పుడు తాను సహజంగానే ఉన్నానని, బయటి ప్రపంచంలో తన గురించి ఉన్న అభిప్రాయంపై తనకు పూర్తి అవగాహన ఉందని జాహ్నవి చెప్పారు. షో అనుభవాన్ని పక్కన పెడితే, నిజమైన పురోగతిని సాధించడానికి ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా ఓటు వేయడంపై దృష్టి సారించాలని ఆమె ప్రజలను కోరారు. రాజకీయ ప్రవేశానికి గల కారణాలు కూడా వెల్లడించారు. తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే తనను పాలిటిక్స్ లోకి అడుగు పెట్టేలా చేశాయన్నారు నటి, యాంకర్ జాహ్నవి. గతంలో ఆహారాన్ని పంపిణీ చేయడం , అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు. అంతేకాకుండా, తన సంపాదనలో 10 శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయించారు.


















