అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
రాజకీయాలు వ్యవస్థలను బలోపేతం చేయాలే తప్పా బలహీన పర్చేందుకు ప్రయత్నం చేయకూడదని అన్నారు. సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను నిర్మించడానికి, పాలనను బలోపేతం చేయడానికి ప్రజలు రాజకీయాల్లోకి వస్తారు, కానీ కొందరు నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీన పరచాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సచివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు; ఈ సమావేశంలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీ నాయకుడు సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా జైలును సందర్శించనున్నారని నాయకులు ముఖ్యమంత్రికి తెలిపారు.
దీనిపై స్పందించారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థల నిర్మాణానికి కట్టుబడి ఉన్నవారు చట్టాన్ని గౌరవిస్తారని, చట్ట పరమైన పరిధిలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్సీ నాయకులకు చట్టం పట్ల గౌరవం లేదని ఆయన ఆరోపించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మాజీ ముఖ్యమంత్రి మద్దతు ఇవ్వడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. నేరాల నివారణను బలోపేతం చేయడానికి , పోలీసింగ్ వ్యవస్థను మెరుగు పరచడానికి 2014-2019 మధ్య తన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతటా సుమారు 15,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అయితే 2019-24 వైఎస్సార్సీ హయాంలో నిర్వహణ లోపం కారణంగా ఆ నిఘా వ్యవస్థ క్షీణించిందని సీఎం ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కెమెరాలన్నింటినీ పునరుద్ధరించామని, దీనివల్ల బలమైన సాక్ష్యాలతో నేరస్తులను గుర్తించి పట్టుకోవడం పోలీసులకు సాధ్యమైందని అన్నారు.


















