బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వృద్ధి గాథ దాని ప్రజల ఆకాంక్షలచే లిఖించ బడుతోందని అన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కర్ణాటక దానిలోని బలమైన అధ్యాయాలలో ఒకటిగా ఉన్నందుకు గర్విస్తోందని పేర్కొన్నారు సీఎం. బెంగళూరు వేదికగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ నిర్వహించింది. ఈ సందర్బంగా సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశ వృద్ధికి చోదక శక్తులలో ఒకటిగా దక్షిణ భారతదేశం ఎందుకు ఆవిర్భవించిందో, సాంకేతికత, ఆవిష్కరణలు, తయారీ, వ్యవస్థాపకతలో కర్ణాటక, బెంగళూరులు ఎందుకు ముందున్నాయో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మన అతిపెద్ద బలం మన ప్రజలేనని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టారు. ప్రతి యువ ఇంజనీర్, వ్యవస్థాపకుడు, రైతు, కార్మికుడు , ఆవిష్కర్త కర్ణాటకను అవకాశాలకు, పెట్టుబడులకు ప్రపంచ గమ్యస్థానంగా మార్చడంలో తమ వంతు కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేయడం , అన్ని రంగాలలో అవకాశాలను విస్తరించడం కొనసాగిస్తున్నందున, కర్ణాటక భారతదేశ వృద్ధి గాథలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు డీకే శివకుమార్. ప్రపంచ వ్యాప్తంగా పోటీపడగల, సమ్మిళితమైన , ఆవిష్కరణలచే నడిచే భవిష్యత్తును నిర్మించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
కర్ణాటక అభివృద్ధి చెందితే, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కలిసి, మనం మరింత బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు సీఎం.
















