అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వసతి, సౌకర్యాలతో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో ఐటీ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. విశాఖ ఐటీ హబ్ గా మారుతోందని, మరో వైపు రాజధాని నగరం అమరావతి భవిష్యత్తులో క్వాంటం కు ముఖ ద్వారంగా ఉండబోతోందని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ ద్వారా భారతదేశపు క్వాంటం ఆశయాలను బలోపేతం చేయగల భాగస్వామ్యం గురించి చర్చించడానికి క్వాంటిన్యూమ్ సీఈఓ డాక్టర్ రాజీబ్ హజ్రా, వారి బృందాన్ని కలవడం నాకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు సీఎం. పరిశోధన, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, క్వాంటం హార్డ్వేర్, సరఫరా గొలుసులు, ప్రతిభ అభివృద్ధి, స్టార్టప్లు, సంస్థాగత స్వీకరణ , వాణిజ్యీకరణలను కలుపుకొని, ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగల ఒక క్వాంటం పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు .
ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కర్తలు ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం కావడం వల్ల, తదుపరి తరం క్వాంటం సాంకేతికతలపై పరిశోధనలు జరిగి, అవి అభివృద్ధి చెంది, ప్రపంచానికి పరిష్కారాలుగా రూపాంతరం చెందే కేంద్రంగా అమరావతి ఆవిర్భవిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత పేరు పొందిన టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు ఏపీ రాజధాని నగరానికి వస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
















