న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్రంలోని మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు . ఏఐసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా తమ గళం వినిపించినందుకు దెబ్బలు తిన్న, బెదిరింపులకు గురైన, లేదా గొంతు నొక్కబడిన ప్రతి విద్యార్థులు పడే బాధను, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే మనమందరం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.
శాంతియుతంగా సమాధానాలు, న్యాయం కోరుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం క్రూరంగా బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు డీకే శివకుమార్. ఇవాళ తాను లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కలిసి ఆందోళనలో పాలు పంచుకున్నానని పేర్కొన్నారు. మన విద్యార్థులు నేరస్తులు కారు. వారు లక్షలాది కుటుంబాల ఆశలు, కలలు. వారే మన దేశ భవిష్యత్తు. యువత నిజమైన ఆందోళనలను వ్యక్తం చేసినప్పుడు, ఎన్నికైన ప్రభుత్వం వారి మాటలను ఓర్పుతో, కరుణతో, గౌరవంతో వినడం దాని కర్తవ్యం. అంతేగానీ, బారికేడ్లు, లాఠీలు, క్రూరత్వంతో స్పందించడం సరి కాదన్నారు డీకే శివకుమార్.
ప్రశ్నలను అణచివేసి, భిన్నాభిప్రాయాలను శిక్షించినప్పుడు ప్రజాస్వామ్యం బలహీన పడుతుందన్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకుంటూ, పార్లమెంటులో అర్థవంతమైన చర్చకు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు సీఎం. భారత యువతకు సమాధానాలు కావాలి. వారికి న్యాయం కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా, వారి మాటలను సానుభూతితో, గౌరవంగా వినాలి; అంతేగాని లాఠీలతో వారి గొంతు నొక్కకూడదన్నారు. పరిపాలన, నైతికతకు సంబంధించిన ఈ ఘోర వైఫల్యానికి ప్రధానమంత్రి, హోంమంత్రి బాధ్యత వహించాలని అన్నారు డీకే శివకుమార్.

















