విశాఖపట్నం జిల్లా : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉపాధి కల్పనతో పాటు పర్యాటకం, విమానయానం, ఆక్వాకల్చర్, ఫార్మాస్యూటికల్స్ , ఎగుమతుల వంటి రంగాలకు ఊతమిస్తుందని ఆయన అన్నారు. విమానాశ్రయం , విశాఖపట్నం మధ్య రవాణా అనుసంధానం గురించి మాట్లాడుతూ, భోగాపురానికి సులభంగా చేరుకునేలా ఏడు ప్రధాన రహదారి మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
విశాఖపట్నంలోని ఆర్.కె. బీచ్ను భోగాపురంతో అనుసంధానిస్తూ ఆరు వరుసల తీరప్రాంత కారిడార్ను నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించారు కేంద్ర మంత్రి. సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, మామిడి పండ్లు, అలాగే ఉద్యాన , వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా, ఏటా 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక ప్రత్యేక కార్గో టెర్మినల్ను నిర్మిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా (ఏవియేషన్ హబ్) అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక్కడ ప్రత్యేక నిర్వహణ, మరమ్మతు , తనిఖీ (MRO) సదుపాయాలతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘ఎడ్యు సిటీ’ (Edu City) కూడా ఏర్పాటు కానుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు.















