చెన్నై : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్లేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని TVK ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తుందని ఆర్లేకర్ పేర్కొన్నారు; అలాగే డీఎంకే హయాంలో మాదకద్రవ్యాల వ్యాప్తి తమిళనాడులో శాంతిభద్రతల సమస్యలకు ప్రధాన కారణమని ఆయన అన్నారు.
టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పాటించడం, భూగర్భ జల మట్టాలను పెంచేందుకు చెరువులు , కుంటలను పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడతామని గవర్నర్ తెలిపారు. TVK ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 717 TASMAC దుకాణాలను మూసి వేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి తమిళనాడుకు దక్కాల్సిన పన్ను వాటాను కోరుతూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు; ఈ అంశంపై తదుపరి చర్యలు చేపట్టేందుకు ఒక ప్రత్యేక న్యాయ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవలే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను సాధించింది టీవీకే పార్టీ. దీంతో మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కక పోవడంతో కాంగ్రెస్, ఇతర పార్టీలను కలుపుకుని పవర్ లోకి వచ్చింది.












