చెన్నై : ప్రముఖ కొరియోగ్రాఫర్ , నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన త్వరలో అగ్ర నటుడు, సీఎం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనిపై రాఘవ లారెన్స్ మీడియాతో మాట్లాడాడు. త్వరలోనే నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను నా అభిమానులతో పంచుకుంటానని చెప్పారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులు తనను రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన చేసేలా చేశాయని అన్నారు. ఇటువంటి ఆశలూ లేకుండా ప్రజలకు సేవ చేయాలనే కోరికతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రవేశం గురించి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు ఇవ్వాలని, తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరానని తెలిపారు. ఇదే క్రమంలో ప్రజల మద్దతు , సూచనలకు తాను ఎంతో విలువ ఇస్తానన్నారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని అన్నారు. అయితే, నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇది పూర్తిగా అసత్యం అని పేర్కొన్నారు రాఘవ లారెన్స్ . కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడాను తప్ప, ఎక్కడా ప్రజలను ఉద్దేశించి అలా అనలేదని అన్నారు.

















