సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా ): రష్యాలోని అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు , అగ్రశ్రేణి ప్రపంచ సరఫరాదారు అయిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ జెఎస్సీ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్స్ నిర్వాహకులతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీసిటీ (తిరుపతి జిల్లా)లోని ఆల్స్టోమ్ భారీ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకొని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని ఆహ్వానించారు. దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేయడానికి, ప్రత్యక్ష రహదారి అనుసంధానాన్ని ఉపయోగించుకుంటూ, అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ , బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మెట్రో నెట్వర్క్ల కోసం కీలకమైన సాంకేతిక ఏకీకరణను అందించే స్మార్ట్ సిగ్నలింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఆర్ అండ్ డి కేంద్రాలు స్థాపనకు భాగస్వాములు అవ్వాలని కోరారు. పోర్టుల్లో ప్రాథమిక రోలింగ్ స్టాక్ ఓవర్హాల్ , సముద్ర ఎగుమతి యార్డ్ను అభివృద్ధి చేయడం, భారీ రైలు వాహనాలను ప్రపంచ మార్కెట్లకు సజావుగా రవాణా చేయడానికి ప్రత్యేకమైన రైల్-సైడింగ్ బెర్త్లను అందించేందుకు ఏపీని ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని సూచించారు. ప్రముఖ మెకానికల్ , రైల్ ఇంజనీరింగ్ సంస్థలతో అనుసంధానించడం ద్వారా, అత్యంత నైపుణ్యం కలిగిన తయారీరంగ ప్రతిభావంతులను నిరంతర సరఫరా చేయవచ్చని అన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ లో టెక్నికల్ స్కిల్ అప్ గ్రేడేషన్, ఇంజనీరింగ్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
















