తిరుమల : టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి టికెట్లు, ఐటీ వ్యవస్థపై చేసిన ఆరోపణలు సత్యదూరమని పేర్కొన్నారు. జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం వాస్తవ విరుద్ధం అన్నారు. వారికి ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్) ,ఎం.ఎస్ (ఇన్నర్మేషన్ సిస్టమ్స్) అర్హతతో పాటుగా 32 సంవత్సరాలుగా ఐటీలో సుదీర్ఘ అనుభవం ఉండటంతో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వారిని జీఎం ఐటీ ఎఫ్ఏసీగా మాత్రమే నియమించడం జరిగిందన్నారు . ఇక సాఫ్ట్వేర్ కు సంబంధించి టీసీఎస్ కొత్తగా సాప్ట్ వేర్ తీసుకు రాలేదన్నారు. 2019 లో తీసుకొచ్చిన సాప్ట్ వేర్ నే వినియోగంలో ఉంచి ఎప్పటికప్పుడు భక్తుల నుండి వచ్చే సలహాలు, సూచనల మేరకు కాలానుగుణంగా టీసీఎస్ ద్వారా సాప్ట్ వేర్ ను మార్పు చేయడం జరుగుతోందని వెల్లడించారు.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆటో ఫిల్లింగ్, కాపీ,పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు ఈవో . తర్వాత టీటీడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఆడిట్ లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడం జరుగుతోందన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ ప్రదర్శించిన శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అవగాహనతో చేసినట్లు అనిపించ లేదన్నారు. వారు టికెట్ బుక్ చేసుకునే సమయంలో పేమెంట్ గేట్ వే వరకు వెళ్లడం జరిగిందన్నారు.. దీనిని వారు సాంకేతిక లోపం అని తెలిపి ఉన్నారు. కానీ వారి అకౌంట్లో సరిపడ నగదు లేనందు వల్ల పేమెంట్ గేట్ వే దగ్గర వారి ట్రాన్సాక్షన్ రిజెక్ట్ చేయబడిందన్నారు. . ఈ అంశాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుందని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.


















