హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ పటేల్, గంగాపురం కిషన్ రెడ్డిలను ఏకి పారేశారు. వారికి అంత సీన్ లేదన్నారు. సోయి లేకుండా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ ప్రజలు ఆదరించక పోతే మీరు కేంద్రంలో మంత్రులు అయ్యే వారా అని ప్రశ్నించారు సీఎం . కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు అయ్యే వారు కానే కాదన్నారు.
గేటు బయట నిలబడి వచ్చే వాడికి పోయే వాడికి నమస్కారం పెట్టడం తప్ప దేనికీ పనికిరారుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ తర్వాత బండి, కిషన్ కి బంట్రోతు ఉద్యోగం కూడా ఉండదన్నారు. సమస్యను అర్థం చేసుకున్న తర్వాత ఎవరి మీద ఆరోపణలు చేయాలనే దానిపై చర్చ చేద్దాం అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు కాబట్టి గుడ్డిగా వెళ్దాం అంటే ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సీఎం. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా లేనట్టేనంటూ ఎద్దేవా చేశారు. ఏనాడైనా పార్లమెంట్ లో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రశ్నించారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
















