హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు రాష్ట్ర మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపింది. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. అందుకే తాను లీగల్ నోటీస్ పంపిస్తున్నట్లు తెలిపింది. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అంతా పారదర్శకతతోనే కొనుగోలు చేయడం జరిగిందని తెలిపింది.
కాగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యత అని సీతక్క ఆరోపించింది. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా హ్యాండిల్స్ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచారించారని మండిపడింది సీతక్క. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించాలని లీగల్ నోటీసులు పంపించానని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే అంగన్వాడీలకు ఫోన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు మంత్రి. కాగా తాను అసెంబ్లీలో కేటీఆర్ను టార్గెట్ చేసినందుకే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది.
















