ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి ప్రారంభం అయ్యే ఐపీఎల్ 2026 మెగా టోర్నీకి సంబంధించి కీలక నిబంధనలు విధించింది. ఇందుకు సంబంధించి ఆయా జట్ల యాజమాన్యాలకు ఝలక్ ఇచ్చింది. ఈ సీజన్ కంటే ముందు బీసీసీఐ కొత్త కీలక నిబంధనలను ప్రవేశ పెట్టడం క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది. ప్రకటించిన ప్రధాన మార్పులలో ఒకటి, మ్యాచ్ రోజులలో ప్రాక్టీస్ సెషన్లపై పరిమితి విధించడం. అన్ని ఫ్రాంచైజీల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశ పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రారంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. మ్యాచ్లు షెడ్యూల్ చేయబడిన రోజులలో ప్రధాన స్క్వేర్లో జట్లకు శిక్షణ లేదా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది బీసీసీఐ.
అయితే, మ్యాచ్ లేని రోజులలో ఫ్రాంచైజీలకు పరిమిత ప్రాక్టీస్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి, వీటిలో నిర్దేశిత ప్రాక్టీస్ ప్రాంతాలలో రెండు నెట్లు, రేంజ్ హిట్టింగ్ కోసం ఒక సైడ్ వికెట్ ఉంటాయి. అయితే, ఓపెన్ నెట్స్కు అనుమతి ఉండదు. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ల సమయంలో ఆటగాళ్లకు బీసీసీఐ కఠినమైన డ్రెస్ కోడ్ను కూడా అమలు చేసింది. ఈ కార్యక్రమాల సమయంలో ఫ్లాపీ టోపీలు లేదా స్లీవ్లెస్ జెర్సీలు ధరించడం నిషేధించ బడింది. ఈ నియమాన్ని మొదటిసారి ఉల్లంఘిస్తే అధికారిక హెచ్చరిక జారీ చేయబడుతుంది, అదే పదేపదే ఉల్లంఘిస్తే ఆర్థిక జరిమానాలు విధించబడతాయి. అదనంగా, టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్లందరూ తప్పనిసరిగా టీమ్ బస్సులలోనే ప్రయాణించాలని బోర్డు ఆదేశించింది.



















