అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డి, ఆయన పరివారం కావాలని కోట్లాది మంది భక్తులను కలిగిన తిరుమల పవిత్ర క్షేత్రం పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తన హయాంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చర్యలు తీసుకున్నారని అందుకే తన పార్టీని కేవలం 11 సీట్లకే జనం పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇకనుంచి తిరుమల గురించి నోరు పారేసుకోవద్దని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నాఆ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడిగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నా మనసును తీవ్రంగా గాయపరిచిందంటూ వాపోయారు అచ్చెన్నాయుడు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం NDDB రిపోర్టులోని చేదు నిజాలనే సభ ముందు ఉంచారని చెప్పారు. కానీ చేసిన పాపం బయట పడుతుందనే భయంతో, ప్రజలు ఛీ కొడతారనే ఆందోళనతో వైసీపీ నేతలు చర్చను దారి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. అన్యమతస్థుడైన జగన్ మోహన్ రెడ్డికి హిందూ ధర్మం అన్నా, స్వామి వారు అన్నా కనీస గౌరవం లేదని నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇందుకు తగిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమర్పించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు అచ్చెన్నాయుడు.



















