గుంటూరు జిల్లా : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రధాన స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళగిరి స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు ప్రధాన కేంద్రంగా మారునుందని ప్రకటించారు. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ – 5 త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయని తెలిపారు ఎంపీ.
బుధవారం మంగళగిరి స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సాన సతీష్ బాబుతో కలిసి పరిశీలించారు ఎంపీ కేశినేని చిన్ని. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియం గా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ – 5 తొలి మ్యాచ్ ప్రారంభం నాటికి మంగళగిరి స్టేడియం ను ఆధునీకరించేందుకు ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. విశాఖపట్నం స్టేడియంలో 45 రోజుల్లో పూర్తిగా ఆధునికరించామని చిన్ని చెప్పారు. అదేవిధంగా రానున్న రెండు నెలలలో, మే నెల నాటికి మంగళగిరి స్టేడియం ఆధునికరణ పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ.
ఆధునికరించిన స్టేడియంను సీఎం నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి , స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ చేతుల మీదగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.



















