తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేశారు. రెండవ రోజైన సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించే వాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటి సూర్య ప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయా మోహాందకారాన్ని తొలగించే సోమస్కంద మూర్తి, భక్తులకు సంసార తాపాన్ని తొలగిస్తున్నారు. అనంతరం శ్రీ స్కోమ స్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.



















