తిరుమల : ఎవరూ ఊహించని రీతిలో టీటీడీ ఈవోగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుండి బదిలీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించింది. సింఘాల్ గతంలో టీటీడీ ఈవోగా పని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా కొలువు తీరాక మరోసారి అనిల్ కుమార్ సింఘాల్ కు రెండోసారి ఈవోగా ఛాన్స్ ఇచ్చారు. సింఘాల్ కొలువు తీరాక కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. టీటీడీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కాగా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం తన మెడకు చుట్టుకుంది.
దీనిపై ఏర్పాటైన సిట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు ఈవోగా ఉన్న సింఘాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పేర్కొంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింఘాల్ ను తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ కె. విజయానంద్ ను ఆదేశించారు. జీవో నెం.191 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.



















