ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధికంగా భక్తులు హాజరయ్యే ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు వన దేవతలను దర్శించుకున్నట్లు సమాచారం. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగింది. భారీ ఎత్తున ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అన్ని రంగాలలో వసతి సౌకర్యాలను కల్పించడంలో సర్కార్ ఘోరంగా విఫలం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేడారం భక్త జనసంద్రమైంది. నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. సంబురాలు అంబరాన్ని తాకాయి.
శాశ్వత నిర్మాణాలతో కొత్త చరిత్రను లిఖించింది. వన దేవతలైన శ్రీ సమ్మక్క, సారలమ్మల
ఆశీర్వాదంతో భక్తులు తరించారు.
వనం నుంచి గద్దెలపైకి విచ్చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వన ప్రవేశం చేసిన క్షణం భక్తి, భావోద్వేగాల సంగమంగా నిలిచింది. భక్తుల హృదయాల్లో అపార విశ్వాసాన్ని నింపింది. నాలుగు రోజుల నుండి అశేష భక్త జనం జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి, వన దేవతలకు బంగారం (బెల్లం), మొక్కులు సమర్పించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన కట్టడాలు, ఆచారాలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తాయి. నాలుగు రోజుల ఉత్సవం మన సంప్రదాయాల గొప్పతనాన్ని, ఐక్యత శక్తిని మరోసారి గుర్తు చేసింది.



















