పాకిస్తాన్ : పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ను ఓడించిన అండర్-19 క్రికెట్ జట్టుకు గ్రాండ్ గా ఆతిథ్యం ఇచ్చాడు. వారిని పేరు పేరునా పలకరించాడు. ఆపై ఇండియాను ఓడించి సత్తా చాటినందుకు గర్వంగా ఉందన్నాడు. మీరు చేసిన కష్టం ఫలించిందన్నాడు. రాబోయే రోజుల్లో కూడా భారత్ పై జరిగే ప్రతీ మ్యాచ్ ను మీరు గెలవాలని పిలుపునిచ్చాడు. ఆపరేషన్ సిందూర్ ను అర్దాంతరంగా ఆపి వేసినా మీరు మాత్రం దేశం గర్వించేలా, ప్రతి పాకిస్తాన్ తల ఎత్తుకునేలా ఆడారాంటూ కితాబు ఇచ్చాడు అసిఫ్ మునీర్. ఈ సందర్బంగా పాకిస్తాన్ లోని రావిల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో పాకిస్తాన్ అండర్ -19 టీంకు స్వాగతం పలికారు.
ఆసియా కప్ పురుషుల U-19ని గెలుచు కోవడంలో వారి అత్యుత్తమ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతే కాదు చారిత్రాత్మక విజయంపై ఫీల్డ్ మార్షల్ ఆటగాళ్లు, జట్టు నిర్వహణ, అధికారులను హృదయ పూర్వకంగా అభినందించారు. జట్టు క్రమశిక్షణ, కృషి, పోరాట స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు. మీరు సాధించిన ఈ గెలుపు ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్. ఇదే సమయంలో ఆటగాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించడం, ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం, మైదానం వెలుపల దేశానికి రాయబారులుగా పని చేయడం కొనసాగించాలని కోరారు.



















