Kaisika Dwadasi : తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. వేంకట తురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి (Kaisika Dwadasi) రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ వార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Kaisika Dwadasi Updates
ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఏడాదికోసారి కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు ఈవో.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
Also Read : TTD Padmavathi Brahmotsavams Interesting : పండుగలా శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు



















