Vinayaka : హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ భాగ్యనగరంలో ఎలాంటి ఇబ్బందులు, ఇక్కట్లు , ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక (Vinayaka) నిమజ్జనం జరిగిందని చెప్పారు. బాలాపూర్ శోభా యాత్ర కొనసాగుతోందని పేర్కొన్నారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు, వినాయకులకు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో పోలీసులు మోహరించారు. చాలా చోట్ల భక్తులకు సాయం కూడా చేశారని పేర్కొన్నారు డీజీపీ. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అంతటా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జితేందర్ చెప్పారు.
Vinayaka Immersion
సజావుగా జరిగేలా చూసేందుకు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయిందన్నారు. బాలాపూర్ గణపతి శోభా యాత్ర ప్రారంభమైందన్నారు. ఇది పూర్తిగా నిమజ్జనం అయ్యేందుకు కనీసం నాలుగు గంటలకు పైగా పడుతుందన్నారు డీజీపీ. నిమజ్జన ప్రక్రియ రేపటి వరకు కొనసాగుతుందని తెలిపారు . ఈ సందర్బంగా నగర వాసులు, భక్తులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ కార్యాలయంతో పాటు బంజారాహిల్స్లోని ఐసీసీ కంట్రోల్ రూమ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది కూడా నిమజ్జన విధుల్లో చేరారని పేర్కొన్నారు.
Also Read : Shocking Comments CM Siddaramaiah : సీఎంపై కామెంట్స్ కేసు నమోదు
















