Ranya Rao : బంగారం అక్రమ రవాణా కేసులో సంచలనం రేపిన కన్నడ నటి రన్యా రావుపై (Ranya Rao) డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రన్యాకు ఏకంగా రూ.102.55 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
Ranya Rao – నలుగురిపై కలిపి రూ.270 కోట్ల జరిమానా
ఈ హై ప్రొఫైల్ కేసులో రన్యాతో పాటు మరో ముగ్గురిపై కూడా DRI చర్యలు చేపట్టింది. నలుగురు నిందితులపై కలిపి రూ.270 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు అందరికీ షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.
కేసు వివరాలు
గత మార్చి 3న 127.3 కిలోల బంగారం అక్రమ రవాణా కేసులో బెంగళూరు పోలీసులు రన్యాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా, మంగళవారం DRI తుది నిర్ణయం వెలువరించింది. రన్యాకు జైలు లోపలే నోటీసులు అందజేయబడినట్లు సమాచారం. బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇతర నిందితులపై చర్యలు
- తరుణ్ కొండూరు రాజు – 72.6 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలడంతో రూ.62 కోట్లు జరిమానా.
- సాహిల్ జైన్, భరత్ జైన్ – 63.61 కిలోల బంగారం అక్రమ రవాణాకు బాధ్యులుగా తేలి, ఇద్దరికీ రూ.53 కోట్లు చొప్పున జరిమానా.
ఈ కేసులో భాగంగా 2,500 పేజీలకు పైగా పత్రాలను షో-కాజ్ నోటీసులతో కలిపి అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చర్యలు తీసుకున్నారు. త్వరలో ప్రాసిక్యూషన్ ప్రారంభమవుతుందని కూడా సూచించారు.
కోర్టు విచారణ
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన COFEPOSA (విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం) పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
Also Read : Beauty Anushka Shetty – Prabhas : డార్లింగ్ తో నటించేందుకు ఎదురు చూస్తున్నా



















