Jajula Srinivas Goud : హైదరాబాద్ – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అవసరం లేదని, చట్ట బద్దమైన రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. అంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42 శాతం కేటాయిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేదానికి అయితే 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపేసినట్లు అని ప్రశ్నించారు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Jajula Srinivas Goud Slams Congress
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి మండలి మొత్తం రాష్ట్ర గవర్నర్ ని కలిసి బిసి రిజర్వేషన్ల పై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. మంత్రివర్గ ఉప సంఘం కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడానికి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు జాజుల శ్రీనివాస్ గౌడ్.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు న్యాయపోరాటం ఇంకొక వైపు రాజకీయ పోరాటం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంపు పై చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే, ఇక చివరి అవకాశం గా మాత్రమే పార్టీ పరంగా బీసీలకు టికెట్లు కేటాయింపు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే బీసీ కులగణనకు అర్థం లేదన్నారు, దేశంలో రోల్ మోడల్ అని చెప్పి ఇప్పుడు తీరా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామంటే ఇది ఓల్డ్ మోడల్ అవుతుందన్నారు.
బీహార్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాలంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను పెంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తే బీహార్ లో బీసీలు కాంగ్రెస్ ను విశ్వసిస్తారని చెప్పారు. రేపు బిహర్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కి రాజకీయంగా మలుపు తిరుగుతోందని రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు. బీసీలకు బిజెపి చేస్తున్న మోసంపై దేశ వ్యాప్తంగా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలతో కలిసి రావాలన్నారు.
Also Read : Popular IAS Srilakshmi Relief : ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి ఊరట
















