Minister Uttam Kumar : కామారెడ్డి జిల్లా – బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎక్కడ చూసినా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలుగా మారాయి. ఓ వైపు భారీ ఎత్తున వరద ఉధృతి కొనసాగుతున్నప్పటికీ ఆయా ప్రాజెక్టులకు గండ్లు పడలేదు. ఇదిలా ఉండగా పోచారం ప్రాజెక్టుకు (Pocharam Project) ఘనమైన చరిత్ర ఉంది. దానికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది తాజాగా కురిసిన వర్షాల దెబ్బకు 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. ఈ ప్రాజెక్టు MFD 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ.
Minister Uttam Kumar Reddy Key Comments
ఇంతటి భారీ వరద నీటిని తట్టుకుని నిలబడటం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar). వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉండేది ఈ ప్రాజెక్టు. ప్రస్తుతం జిల్లాల విభజన కారణంగా ఇది కామారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లింది. మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు ఆనాటి నిజాం రాజు శంకుస్థాపన చేశారు.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం ప్రాజెక్టు తీరుస్తోంది.
నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు, ఈ ప్రాజెక్టు కు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు, గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా, పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా, 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారు. మొత్తంగా పోచారం ప్రాజెక్టు ఇప్పుడు జలకళతో అలరారుతోంది.
Also Read : Janasena Important Meeting : సేనాని సభకు మన్యం వీరుడి పేరు
















