Gold : భారతదేశానికి బంగారం అంటే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వివాహాలు, పండుగలు, శుభకార్యాలన్నింటిలోనూ బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దేశంలో బంగారం (Gold) వినియోగం అధికంగా ఉన్నా, ఉత్పత్తి మాత్రం అత్యల్ప స్థాయిలో ఉంది. ప్రస్తుతానికి భారత్ ఏడాదికి సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నదిగా అంచనా, కానీ దేశీయంగా ఉత్పత్తి అయ్యేది కేవలం 1.6 టన్నులకే పరిమితమై ఉంది.
ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రం నుంచి సానుకూల వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఇటీవల ఒడిశాలో కొత్తగా బంగారు (Gold) ఖనిజ నిల్వలు గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కనుగొనడం దేశ ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపునివ్వనుందని నిపుణుల అభిప్రాయం.
Gold – ఏ ప్రాంతాల్లో బంగారం?
ఒడిశాలోని దేవగఢ్ జిల్లాలో అడసా-రాంపల్లి ప్రాంతం, సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్ జిల్లాల్లో బంగారం ఉనికిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా, మయూర్ భంజ్, మల్కాన్గిరి, సంబల్పూర్, బౌద్ జిల్లాల్లో ప్రాథమిక అన్వేషణలు కొనసాగుతున్నాయని ఒడిశా రాష్ట్ర ఖనిజ శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా అసెంబ్లీలో వెల్లడించారు.
అధికారిక లెక్కలు ఇంకా వెల్లడి కాలేదు కానీ జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం, ఒడిశాలో 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉండే అవకాశం ఉంది. దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన ఈ భద్రతా నిల్వలు, దేశీయ ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా మారనున్నాయి.
Gold – ఒడిశా రాష్ట్రానికి ఉపయోగాలేంటి?
ఇప్పటికే క్రోమైట్, బాక్సైట్, ఇనుము ఖనిజాల ఉత్పత్తిలో ముందున్న ఒడిశా, బంగారం ద్వారా ఖనిజరంగంలో మరింత ముందడుగు వేస్తుంది. ఈ నూతన బంగారు నిల్వల ద్వారా రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు, వ్యాపార వృద్ధి, ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కలగనున్నాయని అంచనా.
ఈ నేపథ్యంలో, ఓడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC) మరియు GSI సంయుక్తంగా దేవగఢ్లో తొలి బంగారు గనిని వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధునాతన డ్రిల్లింగ్ మరియు నమూనా సేకరణ దశలో ఉంది.
ప్రభుత్వ ప్రణాళికలు & తదుపరి చర్యలు
ఈ బంగారు గనులను సమర్థవంతంగా వినియోగించేందుకు కేంద్రం & రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మొదటగా ల్యాబ్ పరీక్షల ద్వారా బంగారు గ్రేడ్, శుద్ధత స్థాయిని గుర్తిస్తారు. అనంతరం సాంకేతిక కమిటీలు సాధ్యత స్టడీ చేసి, పారదర్శక వేలం ప్రక్రియను మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ & రెగ్యులేషన్) చట్టం ప్రకారం అమలు చేస్తారు.
వాటితోపాటు పర్యావరణ, సామాజిక ప్రభావాలపై అధ్యయనాలు నిర్వహించి, గనుల ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా, రహదారి ఏర్పాట్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.
జాతీయ ప్రాధాన్యత ఎందుకింత?
భారతదేశం బంగారం దిగుమతులపై అధికంగా ఆధారపడుతోంది. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు తమకు చెందిన బంగారు నిల్వలను సురక్షితంగా పెంచుకుంటుండగా, భారత్లో అటువంటి స్వావలంబన తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఒడిశాలో బంగారం గనులు కనుగొనడం దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన పరిణామం.
ఈ గనుల ద్వారా దేశంలో బంగారం దిగుమతి భారం కొంతవరకు తగ్గే అవకాశముండగా, స్థానికంగా ఆర్థిక స్వావలంబన పెరిగి, గ్రామీణాభివృద్ధికి దోహదం చేయనుంది.
Also Read : Today Gold Price : స్వల్ప తగ్గుదలలో పసిడి ధరలు



















