అమరావతి : ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎలాంటి అదనపు ఛార్జీలు విధించడం లేదని సంచలన ప్రకటన చేశారు మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క ప్రయాణీకుడికి ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తృతంగా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫెస్టివల్ సందర్బంగా భారీ ఎత్తున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఏపీకి రానున్నారని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తాము అత్యధికంగా బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేశామన్నారు ద్వారకా తిరుమల రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 8,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో దాదాపు 71% రాష్ట్ర అంతర్గత కార్యకలాపాల కోసం కేటాయించడం జరిగిందన్నారు. పండుగ సీజన్లో ప్రయాణికుల డిమాండ్లో వచ్చే పెరుగుదలను తీర్చడానికి, తన సాధారణ సర్వీసులతో పాటు అదనంగా స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మేనేజింగ్ డైరెక్టర్ . ఏ మార్గంలోనూ అదనపు లేదా పండుగ ప్రీమియం ఛార్జీలు వసూలు చేయబోమని, కేవలం సాధారణ ఛార్జీలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు ద్వారకా తిరుమల రావు.
