అబుదాబి : అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈసారి ఐపీఎల్ వేలం పాటలో ఊహించని ప్లేయర్లకు ఛాన్స్ లు దక్కాయి. ఆయా ఫ్రాంచైజీలు తక్కువ ధరకు ఎక్కువ మంది ప్లేయర్లను తీసుకునేందుకు ప్రయత్నం చేశాయి. అయితే ఈసారి రికార్డ్ బ్రేక్ చేశాడు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్. తనను కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.2 కోట్లకు తీసుకుంది. టోర్నీ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాళ్ల లిస్టులో తను మూడో క్రికెటర్ కావడం విశేషం. ఇక అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరిగిన వేలంపాటలో మొత్తం 369 ఆటగాళ్లు లిస్టులోకి వచ్చారు. వీరిలో కేవలం 77 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కైవసం చేసుకున్నాయి.
ఇక కేకేఆర్ కామెరాన్ తో పాటు శ్రీలంకకు చెందిన మతిషా పతిరానాను రూ. 18 కోట్లకు తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఈ ఇద్దరు ఖరీదైన ఆటగాళ్లు కావడం, ఒకే జట్టు తీసుకోవడం చర్చకు దారితీసేలా చేసింది. ఈసారి ఐపీఎల్ లో ఆయా ఫ్రాంచైజీలు వ్యూహాలను మార్చాయి. అత్యధిక ధర చెల్లించేందుకు ఇష్ట పడలేదు. కేవలం తక్కువ ధరకు ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునేందుకు మొగ్గు చూపాయి. పర్స్ పరంగా డబ్బులు ఉన్నప్పటికీ వచ్చే ఐపీఎల్ లో మరికొంత మంది సత్తా చాటే ఆటగాళ్లను తీసుకోవాలని అనుకున్నాయి. ఒక్క కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రమే భారీ ధరకు గ్రీన్ , పతిరానాను తీసుకుంది. మిగతా ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆసక్తి కనబర్చలేదు.



















