హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాకు గురైన స్థ‌లాల‌ను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎక‌రాలు క‌బ్జాల‌కు గురైంది. కొండ‌ల‌ను త‌వ్వుతూ భ‌వంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీట‌ర్ల మేర మ‌ట్టితో నింపి క్ర‌మంగా చెరువులోకి జ‌రిగి ఏకంగా 5 ఎక‌రాల‌ను క‌బ్జా చేశారు. అలా చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మించిన స్థ‌లం నాదంటూ ఓ ప్ర‌జాప్ర‌తినిధి ఇప్పుడు ఏకంగా అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు స్కూల్ బ‌స్సులు, ఐటీ సంస్థ‌ల‌కు చెందిన వాహ‌నాల పార్కింగ్‌తో ప్ర‌తి నెలా రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ అద్దెలు అనుభ‌విస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్క‌డ పార్కింగ్ దందా చేస్తున్నారు.

నెమ్మ‌దిగా మ‌ట్టిని నింపుకుంటూ ఎక‌రం నుంచి 5 ఎక‌రాల వ‌ర‌కూ ఆ ప్ర‌జా ప్ర‌తినిధి ఆక్ర‌మించేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్ర‌మ‌ణ అడ్డుగా మారింది. ఆయ‌న‌ద‌ని చెబుతున్న భూమే ప్ర‌తి ఏటా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. హెచ్ ఎం డీ ఏ మాత్రం 2014లో 160.7 ఎక‌రాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎన్ ఆర్ ఎస్ సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశల్యాన్ని తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. ఈలోపు చెరువు ప‌రిధిలో ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తోంది. దుర్గం చెరువు 1976 వ సంవ‌త్స‌రం నుంచి 1995 వ‌ర‌కూ భ‌ద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కూ మ‌రో 10 ఎక‌రాల మేర క‌బ్జాకు గురై..121 ఎక‌రాల‌కు కుంచించుకు పోయింది. 2000 నుంచి నేటికి మ‌రో 5 ఎక‌రాలు క‌బ్జాకు గుర‌య్యింది. ఇలా ఎప్పుడు ఏ సంవ‌త్స‌రంలో క‌బ్జాల ప‌ర్వం ఎలా సాగిందో ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన శాటిలైట్ చిత్రాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

Exit mobile version