Thangalaan: నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్(Thangalaan)’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. డీ గ్లామర్ పాత్రలో విక్రమ్ లుక్, గెటప్స్ చూస్తే గతంలో సేతు, శివపుత్రుడు, అపరిచితుడు వంటి క్రేజీ హిట్స్ ను తలపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దీనితో ఈ సినిమా కోసం కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీనితో చిత్రయూనిట్ అంతా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. అయితే రిలీజ్కు తంగలాన్(Thangalaan) నిర్మాతకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తంగలాన్ మూవీ రిలీజ్కు ముందే రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుందర్ దాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది.
Thangalaan – అసలేం జరిగిందంటే ?
గతంలో అర్జున్ లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ… మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
Also Read : Saripodha Sanivaram: నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ వచ్చేసింది !