Usha Rani: దేశంలో ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు కోట్లు కొట్టేస్తున్నారు. ఈ ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడిన వారిలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఉంటున్నారు. తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్ నటి ఉషా రాణి(Usha Rani) సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే… తెలివిగా వ్యవహరించి ఆన్లైన్ మోసానికి చెక్ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ… జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది.
Usha Rani…
కార్తీకదీపం ఫేం ఉషారాణి మాట్లాడుతూ… ‘నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ. 5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్కి లింక్ అయి ఉండడంతో నా షాపింగ్కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను.
కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి(Usha Rani) కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా… మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను.
నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో… అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీనితో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని ఉషారాణి చెప్పుకొచ్చింది.
Also Read : Oh Manchi Ghost : నవ్విస్తూ భయపెడుతున్న ‘ఓ మంచి ఘోస్ట్’ ట్రైలర్