NBK : నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య(NBK) సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, రాజశేఖర్ దంపతులు, అశ్వినీదత్, అల్లు అర్జున్, సుహాసిని, నాని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, మంచు విష్ణు, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారెందరో ఈ వేడుకకు హాజరయ్యారు.
NBK-50th Anniversary
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల పండుగలాంటి వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య(NBK) సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ.. తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఆదర్శం కూడా ‘సమరసింహారెడ్డి’.
నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరూ కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.. అని చెప్పుకొచ్చారు.
Also Read : Rajinikanth : జస్టిస్ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ పై స్పందించిన ‘తలైవా’